ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత వేడి రాజుకుంటున్న వేళ, ప్రభుత్వం రైతులకు నానో యూరియాను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూరియా బస్తాల మోత ఇక ఉండదు. కేవలం అర లీటరు నానో యూరియాతోనే ఎకరానికి సరిపోతుంది. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో పాటు పంటలకు పోషకాలను అందిస్తుంది. దీని వాడకంపై వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పిస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది నానో యూరియా వాడకం పెరిగింది.
ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచింది. ప్రభుత్వం యూరియా కొరత లేదంటే.. ప్రతిపక్షాలు మాత్రం రైతులకు సకాలంలో యూరియా అందడం లేదని చెబుతున్నాయి. అయితే రైతులు ఇకపై యూరియా కోసం ఎదురు చూడకుండా, షాపుల దగ్గర గంటల తరబడి నిలబడకుండా సరికొత్త ఆలోచన చేసింది ప్రభుత్వం. రైతులకు యూరియా కష్టాల నుంచి బయటపడేసేందుకు నానో యూరియా అందుబాటులోకి వచ్చింది.
యూరియా బస్తాలను మోసుకెళ్లే పనిలేకుండా.. జస్ట్ అర లీటరు నానో యూరియా వాడితే సరిపోతుంది అంటున్నారు. కేవలం రూ.225కు కొనుగోలు చేయొద్దు.. ఇది పంటలకు పోషకాలను అందిస్తుంది. వరి, పత్తి వంటి పంటలపై నానో యూరియా పిచికారి చేయొచ్చంటున్నారు. రాష్ట్రంలో రైతులకు అవగాహన కల్పిస్తుండటంతో నానో యూరియా వాడకం బాగా పెరిగింది. నానో యూరియా వాడకం రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. ఇది పైరుకు పోషకాలను అందిస్తుంది.. రైతులు దీనిని ఉపయోగించి మంచి దిగుబడి పొందవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో రైతులు యూరియా వాడకం విషయంలో ఇంకా పాత పద్ధతినే ఫాలో అవుతున్నారు.. నానో యూరియాతో ఉపయోగం ఉన్నా సరే ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. వ్యవసాయానికి సంబంధించి శాస్త్రవేత్తలు యూరియాకు బదులుగా నానో యూరియా వాడమని సూచిస్తున్నారు.
సాధారణ యూరియా బస్తాలో ఉండే పోషకాలు, అర లీటరు నానో యూరియాలో ఉంటాయంటున్నారు. యూరియా గుళికల రూపంలో ఉంటే.. నానో యూరియా ద్రవ రూపంలో ఉంటుంది. సాధారణంగా రైతులు ఉపయోగించే యూరియాలో కణాల పరిమాణం 2.8-4 మిల్లీ మైక్రాన్లు ఉంటే.. అందులో మొక్కకు 30 శాతం వరకు మాత్రమే చేరుతుంది. మిగిలిన యూరియా వృథానే (నీటిలో, భూమిలో కలిసి కాలుష్యం చేస్తుంది) అంటున్నారు.
అదే నానో యూరియా కణాల పరిమాణం 32 నానో మైక్రాన్లు ఉంటుంది.. ఏకంగా 80 శాతం పైగా మొక్కకు చేరుతుంది అంటున్నారు.. నానో యూరియా వల్ల వృథా ఉండదు, కాలుష్యం కూడా తగ్గుతుందంటున్నారు. రైతులు ఉపయోగిస్తున్న సాధారణ యూరియా వేర్ల ద్వారా మొక్కకు అందడానికి ఆలస్యం అవుతుంది.
నానో యూరియా జస్ట్ అలా మొక్కల ఆకులపై పిచికారి చేయగానే నేరుగా పత్రహరితానికి చేరి వెంటనే ప్రభావం చూపిస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక్క ఎకరాకి జస్ట్ అర లీటర్ నానో యూరియా చాలు.. దీన్ని లీటర్కు 4 ఎంఎల్ చొప్పున 120 లీటర్ల నీటిలో కలపాలని సూచిస్తున్నారు. దీనిని డ్రోన్ ద్వారా అయితే కనుక ఎకరానికి 350-400 ఎంఎల్ సరిపోతుంది.
యూరియా బస్తా (45 నుంచి 50 కిలోలు) ధర రూ.266 ఉండగా.. వ్యాపారులు రూ.100 అదనంగా వసూల చేస్తే మొత్తం రూ.366 పడుతుంది. రవాణా ఖర్చు నుంచి పొలంలో చల్లేందుకు కలిపి బస్తాకు మొత్తం ఖర్చు రూ.700 వరకు అవుతుంది. దీని బదులుగా నానో యూరియా అర లీటర్ రూ.225కే వస్తుంది.. బస్తాలు మోయాల్సిన పని కూడా లేదు. తక్కువ ఖర్చులోనే నాన యూరియాను ఉపయోగించొచ్చు. రైతులు ఉపయోగించే యూరియా గుళికల వల్ల మొక్కలు పచ్చగా అవుతాయి.
నానో యూరియా ఉపయోగిస్తే మొక్కలు పచ్చగా రావు. ఈ అపోహ వల్లే చాలామంది రైతులు నానో యూరియా ఉపయోగించడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. నానో యూరియాను పూత, గింజ దశలో పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. నానో యూరియా, నానో జింక్ కూడా పిచికారీ చేసుకోవచ్చు అంటున్నారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ ద్వారా నానో యూరియా వాడకంపై రైతుల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నానో యూరియా వాడకం పెరిగిందంటున్నారు.
Social Plugin