Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో జిల్లాల పేర్లు మార్పు, కొత్త పేర్లు.. కొత్త జిల్లాలు కూడా.. మెయిన్ లిస్ట్ ఇదే, బాలయ్య నుంచి ఓ డిమాండ్


AP Districts Name Change: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేబినెట్‌లో కూడా చర్చించారు.. అయితే నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.

 ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశంతో పాటుగా జిల్లా ప్రధాన కేంద్రాలను మార్చాలంటూ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు.. జిల్లాలు సరిహద్దులు, పేర్లు మార్పు.. మండలాల మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తోంది. ఇటీవల ఏడుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది.

 ఈ కమిటీలో అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ యాదవ్‌, పి.నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. తాజాగా కేబినెట్ భేటీలో జిల్లాలకు సంబంధించిన అంశాలన్ని చంద్రబాబు ప్రస్తావించారు.

 ఈ మేరకు నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ కేబినెట్ సబ్ కమిటీని ఆదేశించారుఈ మేరకు జిల్లాల పేర్ల మార్పు, ప్రధాన కేంద్రాలు, డివిజన్‌లు, సరిహద్దులు, మండలాల అంశంపై కమిటీ పరిశీలన ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారట. అలసు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారా అని అడిగారట. కొత్త జిల్లాల ఏర్పాటులో గత ప్రభుత్వం కొన్ని తప్పులు చేసిందన్న చంద్రబాబు.. వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారట.

 ఈ నెల 12 తర్వాత ఉపసంఘం సమావేశం అవుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎంకు వివరించారట. అయితే డిసెంబర్ నాటికి ఈ సమస్యల్ని ఓ కొలిక్కి రావాలని ఆలస్యం చేయొద్దని సూచించారట.

 ఈ ఉప సంఘం జిల్లాల పేర్ల మార్పు, సరిహద్దుల మార్పు, ప్రధాన కార్యాలయాల మార్పు వంటి అంశాలను పరిశీలిస్తుంది. వీటితో పాటుగా డివిజన్లు, మండలాల అంశాలను కూడా పరిశీలిస్తుంది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కూడా ఉపసంఘం పరిశీలించి నివేదికను తయారు చేయనుంది.

ఏపీలో పలు కొత్త జిల్లాల ఏర్పాటు, పేర్లు మార్పు, జిల్లాలు, మండలాలకు సంబంధించిన డిమాండ్‌లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత ఐదేళ్లుగా వినిపిస్తోంది. 

ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలు కలిపి జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది.

ఈ అంశం కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చింది

అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటి కాకుండా రాజంపేట ప్రధాన కేంద్రంగా ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు నర్సాపురాన్ని ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.. కానీ భీమవరాన్ని పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించారు. 

ఇటు శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు అడుగుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కేంద్రంగా పుట్టపర్తి ఉంది.

కొత్త 26 జిల్లాల్లో ఒక గిరిజన జిల్లా ఉంటుందని చెప్పిన గత ప్రభుత్వం.. రెండు జిల్లాలను ప్రకటించింది. పాడేరు ప్రధాన కేంద్రం అల్లూరి సీతారామరాజు.. పార్వతీపురం ప్రధాన కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటైంది. 

అయితే మన్యం జిల్లా పేరు మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. రెవెన్యూ డివిజన్ల విభజనపై కూడా వినతులు వస్తు్న్నాయి. వీటితో పాటుగా పలు రెవెన్యూ డివిజన్లు, మండలాల అంశాలు కూడా తెరపైకి వచ్చాయి.. వాటిని సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.