సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని శనివారం (2వ తేదీ) నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి
తొలి విడత 5 వేలు.. పీఎం కిసాన్తో కలిపి మొత్తం జమ 7 వేలు
సందేహాల నివృత్తికి 155251 నంబరు
సాగునీరు, ఎరువుల కొరత రానీయొద్దు
రైతులకు సాయం భారం కాదు.. బాధ్యత
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం
చేసిన మంచిని ప్రజలకు చెప్పాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం
అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ‘సూపర్ సిక్స్’ హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని శనివారం (2వ తేదీ) నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయని చెప్పారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కేంద్ర వాటాతో కలిపి మొత్తం రూ.7వేలు అందిస్తామన్నారు.
‘అన్నదాత సుఖీభవ’ అమలు సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ, జలవనరుశాఖల ఉన్నతాధికారులతో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు.
జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు, కొన్ని ఆదేశాలు జారీచేశారు.
‘రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందాలని, రైతులకు చేయూతనివ్వడం భారం కాదు.. బాధ్యత అని గుర్తెరగాలి. రైతులకు నిధులే కాదు.. నీళ్లూ ఇస్తున్నాం. ఈనెల 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలి.
గ్రామ సచివాలయాలు, పంచాయతీలు, మండల, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించాలి. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందిస్తామన్న కూటమి హామీని ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’తో నెరవేర్చినట్లయింది.
ఏడాదికి కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయంతో కలిపి, రాష్ట్రప్రభుత్వం మరో రూ.14 వేలు ఇవ్వనుంది. మొదటి, రెండో విడతల్లో రూ.ఐదేసి వేలు చొప్పున, మూడో విడత రూ.4వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. తొలివిడతలో కేంద్రం రూ.2వేలు చొప్పున రూ.831.51కోట్లు విడుదల చేయనుంది.
దీంతో ఆగస్టు 2న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో రైతుకు రూ.7వేలు జమ చేస్తాయి. మరోవైపు ‘అన్నదాత సుభీభవ’కు సంబంధించి 59,750 గ్రీవెన్సులు నమోదు కాగా... 58,464 దరఖాస్తులను పరిష్కరించాం. ఈ పథకంపై సందేహాల నివృత్తి కోసం 155251 టోల్ఫ్రీ నంబరును అందుబాటులో ఉంచాం’ అని చంద్రబాబు చెప్పారు.
చేసి చూపిస్తున్నాం..
రైతులకు హామీ ఇచ్చినట్టుగానే ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు చేసి చూపిస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామని.. చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. ‘‘అన్నదాత సుఖీభవ అందుకునే రైతుల సెల్ఫోన్లకు ఒక రోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సందేశాలు వెళ్లాలి. రైతులు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలి’’ అని తెలిపారు.
అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం నిర్దేశించారు. ఇప్పటి వరకు రైతులకు ప్రభుత్వం అందించిన సాయం, ఇతర వివరాలతో కరపత్రం రూపొందించి, క్షేత్రస్థాయిలో పంచాలని కలెక్టర్లకు సూచించారు.
కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలి
భారత్పై అమెరికా 25శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
‘ఎరువుల విషయంలో కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కడా కొరత రానీయొద్దు. శ్రీశైలం ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. గండికోట, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టులను వంద శాతం నీటితో నింపాలి.
బొప్పాయి ధర తగ్గుదలపై సమీక్ష చేసి రైతులకు న్యాయం చేయాలి’ అని ఆదేశించారు. సమీక్షలో సీఎస్ విజయానంద్, స్పెషల్ సీఎ్సలు రాజశేఖర్, జయలక్ష్మి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూ్షకుమార్, వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
Social Plugin