Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో ఘోరం.. ఆలయానికి వెళ్లివస్తుండగా ప్రమాదం, ఆరుగురు మృతి


ANDRAPRADESH, PRAKASHAM: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. మరోవైపు చనిపోయిన వారిని బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా గుర్తించారు. వీరంతా మహానంది ఆలయానికి వెళ్లి.. దర్శనం చేసుకుని.. తిరిగి ఊరికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది.


ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. కారు, లారీ ఢీకొనటంతో వీరిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.