Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై కీలక అప్డేట్- జీరో ఫేర్ టికెట్-సీఎం ఆదేశాలు..!


ANDHRAPRADESH:ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్న ప్రభుత్వం.. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించి ఈ పథకం అమలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయబోయే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా మహిళలకు 'జీరో ఫేరో టిక్కెట్' ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇవాళ అధికారులకు సూచించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంతమేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి, 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టిక్కెట్‌లో ఉండాలని ఆదేశించారు. జీరో ఫేర్ టిక్కెట్‌ ఇవ్వడం ద్వారా ఎంత లబ్దిపొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తుందన్నారు.


పైన చెప్పిన వివరాలన్నీ టికెట్ పై వచ్చేలా కొత్తగా సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలని సీఎం అధికారుల్ని దేశించారు. ఇవాళ సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో సీఎం సమీక్షించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ ఏ రాష్ట్రాలకు ఆర్ధికంగా ఎంత భారం పడింది, మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో పథకాన్ని ఆగస్ట్ 15 నుంచి సమర్ధవంతంగా అమలు చేయాలని వారిని కోరారు.

మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా చూడాలని కూడా ఆదేశించారు. ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణా వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలన్నారు. లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి, ఎటువంటి విధానాలు తీసుకురావాలనే దానిపై కార్యాచరణ రూపొందించాలన్నారు.


మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్నవాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణా వ్యయం తగ్గుతుందని... అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైనా అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు.