హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (UMTA) సంస్థలు పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ (PRT) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. డ్రైవర్ లేకుండానే.. కేవలం బ్యాటరీతో నడిచే ఈ ర్యాపిడ్ 'పాడ్స్' ఆధారంగా ప్రతి రోజూ 2 లక్షల మంది ప్రజలు తమ గమ్య స్థానాలకు చేరుకోవచ్చు.
ఈ ర్యాపిడ్ పాడ్స్ వల్ల భాగ్య నగరంలో ట్రాఫిక్ కు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి ప్రత్యేక భూసేకరణ అవసరం లేకుండానే ప్రస్తుతం ఉన్న రోడ్ల పక్కనే వీటిని ఏర్పాటు చేయవచ్చని అభిప్రాయానికి వచ్చారు. ఐటీ కంపెనీలు, రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాలైన రాయదుర్గ్ - ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కాచిగూడ - ఎయిర్పోర్టు వంటి మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు.
ఓ వైపు ట్రాఫిక్ రద్దీ, మరోవైపు వర్షాలతో భాగ్య నగర ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఆఫీసులు, స్కూల్స్ , కాలేజీలు, ఇతర పనులకు వెళ్లే ప్రజలు గంటలకొద్దీ ట్రాఫిక్ లోనే గడపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (UMTA) సంయుక్తంగా ఓ ఆలోచన చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు నగరాల్లో విజయవంతంగా అమలు అవుతున్న పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ (PRT) విధానాన్ని హైదరాబాద్ లో ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. ఈ PRT వ్యవస్థలో చిన్న 'పాడ్స్'బాక్సుల మాదిరి ఉంటాయి. ఈ పాడ్స్ లో ప్రతి ట్రిప్ కు 4-6 మంది ప్రయాణికులు తమ లగేజీతో పాటు ప్రయాణించవచ్చు. డ్రైవర్ రహితంగా, పూర్తిగా ఆటోమేటిక్ విధానంలో పనిచేస్తాయి. రోజుకు 2 లక్షల మంది వరకు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చగలవు.
హైదరాబాద్ సిటీ ప్రస్తుతం ప్రపంచంలోని మహా నగరాల్లో 41వ స్థానంలో ఉంది. మెట్రో పాలిటన్ సిటీగా అభివృద్ధి చెందింది. భాగ్యనగరంలో జనాభా నిత్యం పెరిగిపోతోంది. 2025 లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటీ 13 లక్షల 30 వేలుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 2.43 శాతం పెరుగుదల కనిపించింది. అంటే ఏటా దాదాపు 3 శాతం జనాభా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే నగరంలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు అధికారులు అత్యాధునిక సంస్కరణలను తీసుకురానున్నారు.
Social Plugin