ANDHRAPRADESH:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు సంధించారు.
తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన.. పేరుకు మాత్రమే ఉన్నాయని, ఆయా పార్టీల అధినాయకులందరూ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బానిసలేనని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. స్వప్రయోజలే వీరికి మిన్న అని విమర్శించారు
రాష్ట్ర హక్కుల కన్నా.. ప్రధాని మోదీ మెప్పును పొందడమే మిన్నగా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. పదవులు అనుభవించడం మీద ఉన్న శ్రద్ధ విభజన హామీలపై లేదని మండిపడ్డారు. తమ నోరును హక్కుల కోసం కాకుండా మోదీ పేరును జపించడానికి మాత్రమే వాడతారని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల.
ఈ మూడు పార్టీలను ప్రజలు నమ్మి ఓటు వేస్తే.. మతపిచ్చి పార్టీ బీజేపీకి ఊడిగం చేయడం తప్పా ఉద్ధరించింది శూన్యమని షర్మిల ఆరోపించారు. మోదీ చేతిలో 25 మంది లోక్ సభ, 11 మంది రాజ్యసభ ఎంపీలు రబ్బర్ స్టాంప్స్ గా తయారయ్యారని ఆమె చురకలు అంటించారు.
బీజేపీ కోసం పని చేసే కీలుబొమ్మలుగా, రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా గురించి అడిగే దమ్ము ఏ పార్టీకీ లేదని షర్మిల అన్నారు. రాజధానికి నిధులు అడిగే సత్తా లేదని, పోలవరం ప్రాజెక్టును టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచుతుంటే ఎదురు తిరిగే ధైర్యం లేదని చెప్పారు.
అడ్డికి పావుసేరు కింద విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని చంద్రబాబు ప్రభుత్వం అమ్ముతున్నా కూడా పౌరుషం ఉండట్లేదని షర్మిల ఘాటుగా విమర్శించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హక్కులపై గళం విప్పకుండా.. బీజేపీ అక్రమ బిల్లులకు గొర్రెల్లా తల ఊపడం తప్పా మన ఎంపీలకు ఏమి చేత కావట్లేదని అన్నారు.
రాష్ట్ర ఎంపీలకు దమ్ము, ధైర్యం, పౌరుషం అనేది ఉంటే.. ఈ రాష్ట్ర బిడ్డలే అయితే.. మీలో పారుతున్నది చీము నెత్తురే అయితే.. మోదీ తొత్తులు కాదనుకుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే మీకు ముఖ్యం అనుకుంటే.. ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర హక్కులపై నిలదీయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
మోదీ మోసాన్ని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలో ప్రశ్నించాలని పట్టుబట్టారు. విభజన హామీలపై నోరు విప్పాలని, తిరుపతి వేదికగా ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా ఏమయ్యిందని నిలదీయాలని డిమాండ్ చేశారు. హోదాపై తాడోపేడో తేల్చాలని, ఢిల్లీని తలదన్నే రాజధాని ఏదని అడగాలని అన్నారు.
కేంద్రం బాధ్యతగా అమరావతికి నిధులు కాకుండా అప్పులు ఎందుకు ఇస్తున్నారో సమాధానం చెప్పమనాలని, జీవనాడి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు కుదించి ఎందుకు జీవం తీశారని ఉభయ సభలను స్తంభింపజేయాలని షర్మిల అన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఉండదని మోదీతో అధికారిక ప్రకటన చేయించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
Social Plugin